న్యూఢిల్లీ: దేశంలోని సగానికిపైగా రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 114 మంది ఒమిక్రాన్ రోగులు కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితి, ఒమిక్రాన్ కేసుల తీరును కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మీడియాకు శుక్రవారం వివరించారు. కరోనా యాక్టివ్ కేసుల పరంగా టాప్ ఐదులో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలున్నాయని తెలిపారు. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న 11 రాష్ట్రాల పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.
కరోనా నాల్గవ వేవ్ను ప్రపంచం చూస్తున్నదని, మొత్తం పాటిజిటివీ రేటు 6.1 శాతంగా ఉందని రాజేష్ భూషణ్ తెలిపారు. అందువల్ల మనమంతా జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం తగదన్నారు. రాత్రి కర్ఫ్యూ, జన సమూహాల కార్యక్రమాలను నియంత్రించడం వంటి ఆంక్షలు విధించాలని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 21న అన్ని రాష్ట్రాలకు సూచించిందని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులలో పడకల సామర్థ్యం పెంచడంతోపాటు కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నట్లు వెల్లడించారు.