బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. జేఎన్.1 వేరియంట్ కరోనా వైరస్ కేసులు (JN.1 Covid variant cases) 34 నిర్ధారణ అయ్యాయి. ఒక్క బెంగళూరులోనే 20 జేఎన్.1 వేరియంట్ కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మైసూరులో నాలుగు, మాండ్యలో మూడు, రామనగర, బెంగళూరు రూరల్, కొడగు, చామరాజ నగరాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైనట్లు పేర్కొంది. కరోనా సోకిన వారిలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు వెల్లడించింది.
కాగా, సేకరించిన 192 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 60 శాంపిల్స్ ఫలితాలు వచ్చాయని పేర్కొంది. మిగతా పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ వివరాలు బుధవారం నాటికి అందుతాయని వెల్లడించింది. మరోవైపు పొరుగున ఉన్న కేరళ, తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, కర్ణాటకలో అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరించింది.