గాంధీనగర్, మార్చి 29: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రభుత్వ, గ్రాంట్-ఇన్-ఎయిడ్ పాఠశాలల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది. 2022 డిసెంబర్ వరకు అందిన గణాంకాల ప్రకారం గుజరాతీ, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో 32 వేలకుపైగా టీచర్లు, ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని బుధవారం శాసనసభలో తెలిపింది. ఈ ఖాళీల్లో 3,552 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి కుబేర్ డిండోర్ మంత్రి తెలిపారు. మొత్తం 32,674 ఖాళీల్లో 20,678 పోస్టులు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా, అందులో 14 జిల్లాల్లో ఒక్క ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ పాఠశాల కూడా లేదని వెల్లడించారు. 9, 10 తరగతులు నిర్వహించే ఆంగ్ల మాధ్యమ పాఠశాల కనీసం ఒక్క జిల్లాలో కూడా లేదని సమాధానమిచ్చారు. ప్రభుత్వం 11, 12 తరగతుల కోసం ఒక్క ఇంగ్లిష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ను కూడా నిర్వహించడం లేదని తెలిపారు. 31 జిల్లాల్లో ఒక్క గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల కూడా లేదని చెప్పారు.
కేంద్రంలో 9.8 లక్షల ఖాళీలు
దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నా, ఉద్యోగాల భర్తీపై కేంద్రంలోని బీజేపీ సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. కేంద్రంలో లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా పేరుకుపోవడమే ఇందుకు సాక్ష్యం. 2021, మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్సభలో వెల్లడించారు. వీటిలో రైల్వే శాఖలో అత్యధికంగా 2.93 లక్షల ఖాళీలు ఉండటం గమనార్హం. రక్షణ(సివిల్) విభాగంలో 2.64 లక్షల పోస్టులు, హోంశాఖలో 1.43 లక్షలు, పోస్టల్లో 90 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.