ముంబై ఆగస్టు 29: ముంబైలోని అత్యంత సంపన్న గణేశ్ ఉత్సవ కమిటీ జీఎస్బీ సేవా మండల్ భక్తజనం భద్రత కోసం భారీస్థాయిలో రూ.316.40 కోట్ల బీమా తీసుకున్నది. అన్నిరకాల నష్టాలూ ఈ బీమాలో కవర్ అవుతాయని మండల్ చైర్మన్ విజయ్ కామత్ చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఏదైనా జరిగినా బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుందని అన్నారు.
సిబ్బందితో పాటుగా ప్రతి భక్తుని బీమా భద్రత కల్పించడం మా కనీస బాధ్యత అని కామత్ అన్నారు. కింగ్స్ సర్కిల్ వద్ద జీఎస్బీ సేవా మండల్ 68 సంవత్సరాలుగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ముంబై గణేశ్ మండల్స్ అన్నిటిలోకి తమదే అతిపెద్ద బీమా అని కామత్ పేర్కొన్నారు. వెండి, బంగారం వంటి విలువైన వస్తువులకు రూ.31.97 కోట్లు, పండాల్కు, కార్యకర్తలకు, పూజారులకు, వంటవారికి, చెప్పుల స్టాల్స్, వాలెట్ పార్కింగ్ నడిపేవారికి, భద్రతా సిబ్బందికి, భక్తులకు కలిపి రూ.263 కోట్ల బీమా ఉంటుంది.