చండీగఢ్: పంజాబ్లో మళ్లీ పంట వ్యర్థాల దగ్ధం ఘటనలు పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే 3,032 చోట్ల పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టారు. ఇప్పటి వరకు నమోదైన పంట వ్యర్థాల దహనంలో 55 శాతం గత ఐదు రోజుల్లో జరిగినట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలిసింది. పంజాబ్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 23,465 చోట్ల వ్యవసాయ వ్యర్థాలను రైతులు తగులబెట్టారు. నవంబర్ 4 నాటికి గత ఏడాది 44,086 పొలం మంటల ఘటనలు నమోదు కాగా, ఈసారి అందులో సగం మేర నమోదయ్యాయి.
పంట వ్యర్థాలను తగులబెట్టకుండా నియంత్రించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రైతులు లెక్కచేయడం లేదు. కొంతమంది రైతులు పంటకోత తర్వాత మిగిలిన గడ్డి తొలగింపునకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే, చాలా మంది మధ్యస్థ, సన్నకారు రైతులు తమ పొలాలలోనే పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు.
మరోవైపు ఢిల్లీలో గాలి కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాల దహనాన్ని అడ్డుకునేందుకు పంజాబ్ కాలుష్య నియంత్రణ బోర్డు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నిఫుణుల బృందాలను పంపి గడ్డిని తగులబెట్టే రైతులకు అవగాహన కల్పించడంతోపాటు జరిమానా విధిస్తున్నది.