బెంగళూరు : కర్ణాటకలోని అధికార కాంగ్రెస్లో పదవుల కోసం కుమ్ములాటలు నిత్యకృత్యంగా మారాయి. పాలనను గాలికొదిలేసిన పాలకులు పదవుల పందేరంలో మునిగిపోతున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య సీఎం సీటు కోసం పోరు సాగుతుండగా, తాజాగా మంత్రి పదవుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు పోరు సాగిస్తున్నారు. తక్షణమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని, తమకు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు సుమారు 30 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి వెళ్లేముందు ఎమ్మెల్యే గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తాము ఇప్పటికే అనేక సార్లు సమావేశమయ్యామని, తమకు క్యాబినెట్ స్థానం కల్పించేలా ఒత్తిడి పెంచాలని సమష్ఠిగా నిర్ణయించామన్నారు. ‘కొంతమంది నేతలకు మూడు, నాలుగు, ఐదుసార్లు కూడా అవకాశాలు కల్పించారు. ఇప్పటివరకు అవకాశం రాని వారికి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతాం’ అని చెప్పారు. మరో ఎమ్మెల్యే అశోక్ పట్టన్ మాట్లాడుతూ.. సమ్మిళిత నాయకత్వం కోసమే తమ ప్రయత్నం అని చెప్పారు.
‘మాది ఒకేఒక్క డిమాండ్. వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి మాలాంటి సీనియర్లకు అవకాశం కల్పించాలి’ అని కోరారు. రెండేండ్ల తర్వాత ఇతరులకు అవకాశం ఇస్తామని ఇదివరకు సీఎం సిద్ధరామయ్య చెప్పారని, అయితే ఇప్పటికే దాదాపు మూడేండ్లు కావొస్తున్నదని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, వేణుగోపాల్, రణ్దీప్ సుర్జేవాలాను కూడా కలిసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. తమ డిమాండ్లో వివాదాస్పదం ఏమీ లేదని, దీనిపై హైకమాండే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. సుమారు 25 బెర్త్లు తమకు కేటాయించాలని వారు కోరారు. చాలా మంది నేతలు అనేక సార్లు మంత్రిపదవులు చేపట్టారని, దీంతో కొత్తవారికి అవకాశం లేకుండా పోతున్నదని వాపోయారు. కాంగ్రెస్ నేతల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు పార్టీ నేతలు పాలనను గాలికొదిలేసి, నిత్యం పదవుల కోసం కొట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.