శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఉగ్రవాదులు, భద్రత బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులను రక్షణ దళాలు మట్టుబెట్టాయి. శ్రీనగర్ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో గురువారం రాత్రి స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా రాత్రి పొద్దుపోయిన తర్వాత గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు.
వారిలో ఒకరిని జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సుహైల్ అహ్మద్ రాథర్గా గుర్తించామన్నారు. మిగిలిన ఇద్దరిని గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. ఘటనా స్థలంలో యుద్ధ సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, రెండు రోజుల వ్యవధిలో జమ్ముకశ్మీర్లో తొమ్మిది మంది ఉగ్రవాదలును భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు అనంత్నాగ్, కుల్గాం జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.