న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. గురువారం రెండు రాష్ర్టాలు, ఒక యూటీలో ఒకే దశలో చేపడుతున్న పోలింగ్లో.. దాదాపు 5.3 కోట్లమంది ఓటర్లు ఆయా పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. అస్సాంలో ద్విముఖ పోరు, కేరళలో సైద్ధాంతిక పోరు, పుదుచ్చేరిలో బహుముఖ పోటీపై నేడు ఓటర్ల తీర్పు చెప్పనున్నారు. రెండు రాష్ర్టాలు, ఒక యూటీలో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలుకానున్నది. వేలాదిగా ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ల వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించగా, వెబ్కాస్టింగ్ వంటి ఏర్పాట్లు జరిగాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
140 అసెంబ్లీ స్థానాలున్న దేవభూమి కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది. 883 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ధీమా వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఖాతా తెరువని కమలం పార్టీ.. ఈ సారి ఎలాగైనా ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్నది. మొత్తం ఓటర్లలో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
అస్సాంలో బీజేపీ-కాంగ్రెస్ కూటమి మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది. ఇక్కడ గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్కు నేతృత్వం వహిస్తుండగా, సీఎం హిమంత నాయకత్వంలో బీజేపీ కూటమి మూడోసారి విజయంపై కన్నేసింది. 2016లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోగా, ఈసారి విజయం కోసం 99 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. 126 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఓటర్లు 2.50 కోట్లమంది ఉండగా, దీంట్లో 1.25 కోట్ల మంది మహిళలు, 318 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.
కేవలం 30 అసెంబ్లీ స్థానాలు.. దాదాపు 9.5 లక్షల మంది ఓటర్లు కలిగిన పుదుచ్చేరిలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 294 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడ్డారు. రాష్ట్ర హోదా ప్రధాన అంశంగా ఈసారి పుదుచ్చేరి ఎన్నికల సంగ్రామం సాగింది. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పటికీ పుదుచ్చేరిలో స్వతంత్ర పాలన లేదని కాంగ్రెస్-డీఎంకే కూటమి ఆరోపిస్తున్నది. విజయ్ రంగ ప్రవేశంతో ఈ సారి ఇక్కడ త్రిముఖ పోరు నెలకొన్నది.