న్యూఢిల్లీ: మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం మూడు పథకాలను ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలను వివరించారు. ఈ పథకాల ద్వారా మహిళల మేధో, సామాజిక, ఆర్థికవృద్ధి మెరుగుపడుతున్నదని అన్నారు. మహిళలు, పిల్లల సాధికారతకు తమ ప్రభుత్వం ఎన్నో చేస్తున్నదని చెప్పారు. ‘మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సమర్థ అంగన్వాడీ-పోషణ్ 2.0 వంటి పథకాలను ప్రభుత్వం సమగ్రంగా పునరుద్ధరించింది. నారీ శక్తి ప్రాముఖ్యతను గుర్తిస్తూ, మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధిని అందించడానికి ఈ మూడు పథకాలు ప్రారంభించాం’ అని తెలిపారు.
పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బాలల అభివృద్ధి కోసం అంగన్వాడీలను క్లీన్ ఎనర్జీతో అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అప్గ్రేడ్ చేసిన అంగన్వాడీలు ఈ దిశలో కీలకంగా ఉంటాయని అన్నారు.
మహిళల జీవితాల మెరుగు కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మహిళల అభివృద్ధి, మహిళా సాధికారతకు లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ శక్తిని బలోపేతం చేయడంతోపాటు దీనిని మరింతగా విస్తరించినట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మిషన్ శక్తి విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తద్వారా దేశ నిర్మాణానికి ఇది సహాయపడుతుందన్నారు.