కోల్కతా: దారి అడిగినందుకు పిల్లలను ఎత్తుకెళ్తారనుకొని సాధువులను (Sadhus) చితకబాదిన ఘటన పశ్చిమబెంగాల్లోని పురులియా (Purulia) జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ సాధువు తన ఇద్దరు కుమారులతో కలిసి మకర సంక్రాంత్రి (Makar Sankranti ) సందర్భంగా పశ్చిమబెంగాల్లో జరుగుతున్న గంగాసారగ్ మేళాకు (Gangasagar Mela) కారులో బయల్దేరారు. బెంగాల్లోని పురులియా జిల్లాకు చేరుకున్నారు. ఈ క్రమంలో దారితప్పిన వారు.. రూట్ గురించి ఇద్దరు టీనేజ్ బాలికలను అడిగారు. అయితే భయపడిన వారు కేకలు వేశారు.
దీంతో స్థానికులు పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చారనుకొని సాధువులను వెంబడించి పట్టుకున్నారు. వారిపై దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పురూలియా ఎస్పీ అభిజిత్ బెనర్జీ చెప్పారు. సాధువులపై దాడిచేసినవారిని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.