బెంగళూరు: ఒకే రోజు మూడు హత్యలు జరిగాయి. వేర్వేరుగా జరిగిన ఈ సంఘటనల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురికాగా, ఒక నేరస్తుడ్ని పత్యర్థులు నరికి చంపారు. ఈ మూడు హత్యలతో రాజధాని నగరం ఉలిక్కిపడింది. (3 murders in Bengaluru) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ మూడు సంఘటనలు జరిగాయి. ఆదివారం మహాలక్ష్మి లేఅవుట్లో మొదటి హత్య జరిగింది. పెళ్లి విషయంలో గొడవ కారణంగా 23 ఏళ్ల అంజలిని ఆమె ప్రియుడు రాజీవ్, కత్తితో పొడిచి హత్య చేశాడు. వీరిద్దరూ మూడేళ్లకు పైగా ప్రేమలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే రాజీవ్ నేర చరిత్ర కారణంగా ఆ యువతి కుటుంబం వారి సంబంధాన్ని వ్యతిరేకించినట్లు తెలిసిందన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
కాగా, అదే రోజున కొన్ని గంటల్లోనే బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మునియప్ప లేఅవుట్లో మరో మహిళ హత్యకు గురైంది. అద్దె ఇంట్లో నివసిస్తున్న 40 కృష్ణ బర్మన్ గొంతు నులిమి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఇటీవల ఎవరితో మాట్లాడింది? ఆమె కదలికలు, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు ఆదివారం సాయంత్రం జేపీ నగర్ రోడ్డులోని ఐజీ సర్కిల్ సమీపంలో బహిరంగంగా మూడో హత్య జరిగింది. హత్య, హత్యాయత్నం, దోపిడీతో సహా పలు క్రిమినల్ కేసులున్న నేరస్థుడు రాజా అలియాస్ హల్ముక్ రాజాను కారులో వచ్చిన దుండగులు వెంబడించారు. కత్తులు, కొడవళ్లతో దాడి చేసి నరికి చంపారు. పాత కక్షలు, ప్రతీకార చర్యగా ప్రత్యర్థులు అతడ్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఒకే రోజు మూడు హత్యలు జరుగడంతో బెంగళూరు వాసులు ఉలిక్కిపడ్డారు. రాజధాని నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన చెందుతున్నారు.