భువనేశ్వర్ : ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఒక మావోయిస్టు మృతి చెందారు. ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. తులసీ ఫారెస్ట్ రేంజ్ లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మల్కన్గిరి పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ చేస్తుండగా.. కెరిమిటి గ్రామం వద్ద పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో కాల్పులు ప్రారంభించడంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు డీజీపీ అభయ్ తెలిపారు. ఘటనాస్థలి నుంచి రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఏరియాలో సుమారు 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు.