Bihar | పాట్నా : దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
గోపాల్ గంజ్ జిల్లాలోని రాజా దాల్ పూజా పండల్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో, తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ చిన్నారి భక్తుల మధ్య కిందపడిపోయింది. ఆ చిన్నారిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ముగ్గురిని చికిత్స నిమిత్తం సదర్ హాస్పిటల్కు తరలిస్తుండగా, దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.