న్యూఢిల్లీ: పశ్చిమాఫ్రికా దేశమైన మాలి (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ (Kidnap)కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన అల్ఖైదాతో అనుబంధం ఉన్న టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు భారత విదేశాంగశాఖ గురువారం వెల్లడించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈనెల 1న సిమెంటు ఫ్యాక్టరీపై దాడిచేసిన సాయుధ దుండగులు.. అక్కడ పనిచేస్తున్న కార్మికులను బంధించారని, వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని తెలిపింది. అయితే వారి వివారలను మాత్రం వెల్లడించలేదు. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. బందీలను సురక్షితంగా విడుదల చేయడాలనికి చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ అల్ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్ (JNIM) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాలీలో ఉన్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది.