పూరీ: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో (Jagannath Rath Yatra) అపశ్రుతి చోటుచేసుకున్నది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. జగన్నాథుడు, అతని తోబుట్టువులు బలధ్రుడు, సుభద్రా దేవితో కూడిన రథాలు ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకున్నాయి. రథాలను లాగేందుకు, జగన్నాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందాచరు. వారిలో ప్రభాతి దాస్, బసంతి సాహూ అనే ఇద్దరు మహిళలు ఉండగా, ప్రేమ్కాంత్ మొహంతి అనే 70 ఏండ్ల వృద్ధుడు ఉన్నారు. వీరంతా ఒడిశాలోని ఖుద్రా జిల్లాకు చెందినవారని, పూరి రథయాత్రను తిలకించేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, భక్తుల రద్దీకి తగిన విధంగా పోలీసులు ఏర్పాట్లు చేయలేదని స్థానిక మీడియా వెల్లడించింది.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాత రథయాత్ర ఈ నెల 27న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రథయాత్రలో అధిక వేడి, రద్దీ కారణంగా తొలిరోజే పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 600 మందికిపైగా భక్తులు అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. ‘శుక్రవారం జరిగిన రథయాత్ర సందర్భంగా దాదాపు 625 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఎండ, ఉక్కపోత, రద్దీ కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని ఆసుపత్రుల్లో చేర్పించాల్సి వచ్చింది. రథాలను లాగేందుకు పోటీపడి పలువురు స్వల్పంగా గాయపడ్డారు’ అని అధికారులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం పలువురు డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.