బెంగళూరు: అరుదైన జంతువులను విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 18 విదేశీ జంతువులను గుర్తించారు. వాటిలో 14 సరిస్రూపాలు ఉన్నాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై కస్టమ్స్ చట్టాల కింద కేసు నమోదుచేశామని అధికారులు వెల్లడించారు. థాయ్లాండ్ నుంచి వాటిని తరలిస్తున్నారని చెప్పారు. నిర్ధిష్టమైన సమాచారంతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు.
ఇదేతరహాలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్పై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 34 అంతరించిపోతున్న జాబితాలో ఉన్న జీవులతోపాటు 48 జాతులకు చెందిన 139 జంతువులను రక్షించారు. వాటిని జంతు ప్రదర్శనశాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అవన్నీ స్మగ్లింగ్ చేసిన జంతువులేనని చెప్పారు.