న్యూఢిల్లీ, డిసెంబర్ 23: చైనాలో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఒక్క రోజులోనే 3.7 కోట్ల మందికి వైరస్ సోకిందని బ్లూమ్బర్గ్ సంస్థ పేర్కొంది. కరోనా ప్రభావం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఈ స్థాయి కేసులు నమోదుకావడం కూడా ఇదే తొలిసారి. ఈ కథనం ప్రకారం.. డిసెంబర్లో మొదటి 20 రోజుల్లో 24.8 కోట్ల మంది చైనా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపుగా 18 శాతం.
రాజధాని బీజింగ్, సిచువాన్ ప్రావిన్స్లో దాదాపుగా సగం మందికి వైరస్ సోకింది. చైనాకు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ అంతర్గత సమావేశంలో అధికారులు ఈ అంచనా వేశారు. ఈ సమావేశం వివరాలు బయటకు పొక్కడంతో ఈ లెక్కలు బహిర్గతమయ్యాయి. అయితే, ఈ అంచనా ఎలా వేశారనేది మాత్రం వెల్లడి కాలేదు. దీనిపైన స్పందించేందుకు కూడా ఈ సంస్థ నిరాకరించింది.