న్యూఢిల్లీ: దేశంలోని 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 28 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 143 మహిళా చట్టసభ్యురాళ్లుపై నేర సంబంధ ఆరోపణలున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ తెలిపింది. (Criminal Cases on Women MP, MLAs) 75 మంది లోక్సభ మహిళా ఎంపీలలో 24 మంది (32 శాతం), 37 మంది రాజ్యసభ మహిళా ఎంపీలలో 10 మంది (27 శాతం), అన్ని రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 400 మంది మహిళా ఎమ్మెల్యేలలో 109 మంది (27 శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో 14 మంది లోక్సభ, ఏడుగురు రాజ్యసభ మహిళా ఎంపీలు, 57 మహిళా ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 78 మంది మహిళా ప్రజాప్రతినిధులు (15 శాతం) హత్యాయత్నం, హత్య వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
కాగా, రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే గోవాకు చెందిన ముగ్గురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఇద్దరు (67) శాతం, తెలంగాణలోని 12 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 8 మంది (67 శాతం), ఆంధ్రప్రదేశ్కు చెందిన 24 మందిలో 14 మంది (58 శాతం), పంజాబ్కు చెందిన 14 మందిలో 7 మంది (50 శాతం), కేరళ నుంచి 14 మందిలో 7 మంది (50 శాతం), బీహార్ నుంచి 35 మందిలో 15 మంది (43 శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి.
మరోవైపు పార్టీల పరంగా పరిశీలిస్తే అత్యధికంగా మొత్తం 217 మంది బీజేపీ మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 11 శాతం మందిపై తీవ్రమైన నేర అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని 83 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో అత్యధికంగా 34 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 20 శాతం మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి చెందిన 20 మంది మహిళా చట్టసభ్యుల్లో 65 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 45 శాతం మందిపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన 13 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 69 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 31 శాతం మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.