న్యూఢిల్లీ: చైనాతో బోర్డర్ టెన్షన్ నేపథ్యంలో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్రన్ లడాఖ్లో ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లలో.. భారత్ సుమారు 26 క్షేత్రాలను కోల్పోయినట్లు ఓ రిపోర్ట్ రిలీజైంది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్లో ఉన్న ఓ సీనియర్ పోలీసు అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాతో కలిగి ఉన్న సుమారు 3500 కిలోమీటర్ల మేర బోర్డర్లో అనేక చోట్ల ఉద్రికత్తలు నెలకొన్న విషయం తెలిసిందే.
అయితే కరాకోరమ్ పాస్ నుంచి చుముర్ వరకు ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లలో.. మన సైనికులు 26 పెట్రోలింగ్ పాయింట్లను కోల్పోయినట్లు ఓ అధ్యయన నివేదిక ద్వారా వెల్లడైంది. పీపీ నెంబర్లు 5-17, 24-32, 37 మన ఆధీనంలో లేనట్లు లేహ్ ఎస్పీ పీడీ నిత్య తన నివేదికలో తెలిపారు.
గత వారం ఢిల్లీలో ప్రధాని మోదీ,హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అడ్వైజర్ అజిత్ దోవల్తో జరిగిన మీటింగ్లో ఈ రిపోర్టును అందజేశారు. భద్రతా దళాలు లేని ప్రదేశాలను చైనా టార్గెట్ చేసిందని, అక్కడే ఇంచు ఇంచు చైనా ఆక్రమిస్తోందని రిపోర్ట్లో తెలిపారు. నిఘా లేని ప్రాంతాలను బఫర్ జోన్లుగా పిలుస్తారు. అయితే ఆ ప్రాంతాల్లో కెమరాలను ఫిక్స్ చేసిన చైనా మన సైనికుల కదలికల్ని మానిటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రణాళిక వేసిన చైనా.. 2020లో గల్వాన్ వద్ద దాడికి ప్రయత్నించిందని రిపోర్ట్లో తెలిపారు. గల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.