Maharashtra | ముంబై : మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ గురువారం ప్రకటించారు. 10 నెలల కాలంలో అంటే ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 2,366 మంది రైతులు చనిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతి రెవెన్యూ డివిజన్లో అత్యధికంగా 951 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు మంత్రి అనిల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అమరావతి తర్వాత ఛత్రపతి సాంబాజీనగర్ డివిజన్లో 877 మంది, నాగపూర్ డివిజన్లో 257, నాశిక్ డివిజన్లో 254 మంది, పుణె డివిజన్లో 27 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు.