న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త క్యాబినెట్ రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. గురువారం సమావేశమైన కేంద్ర కొత్త మంత్రివర్గం, కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర్డ్ వేవ్కు సన్నద్ధమయ్యేందుకు కొత్త అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ కింద రూ.23,132 కోట్ల ఫండ్ను ప్రకటించింది. ఇందులో రూ.15,000 కోట్ల నిధులను కేంద్రం ఖర్చు చేస్తుందని, రూ.8,000 కోట్ల నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తారని కొత్త కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. 736 జిల్లాల్లో పీడియాట్రిక్స్ విభాగాలు, 20,000 కొత్త ఐసీయూ పడకల ఏర్పాటు ఇందులో 20 శాతం పడకలు పిల్లల కోసం, నర్సింగ్ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, జిల్లా స్థాయిలో ఔషధాల బఫర్ స్టాక్ కోసం ఈ ప్యాకేజీ సహాయపడుతుందని చెప్పారు. రానున్న 9 నెలల్లో ఈ ప్యాకేజీని అమలు చేస్తామని, వచ్చే ఏడాది మార్చిలోపు ఇది పూర్తవుతుందని వివరించారు.