చెన్నై: తమిళనాడుకు చెందిన 23 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. నాగపట్నంకు చెందిన ఈ మత్స్యకారులు ఈ నెల 11న చేపలవేట కోసం రెండు బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. అయితే అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటారన్న ఆరోపణతో శ్రీలంక నేవీ సిబ్బంది వారి బోట్లను చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నారు. అందులోని 23 మంది తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్ చేసి శ్రీలంకలోని కంకేశంతురై నావల్ క్యాంప్కు తరలించారు.
నాగపట్నం మత్స్యకారుల సంఘం అధిపతి అరులానందం ఈ విషయాన్ని నిర్థారించారు. శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన తమిళనాడు మత్స్యకారులను క్షేమంగా తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శ్రీలంక నేవీ సిబ్బంది తమ మత్స్యకారులను తరచుగా వేధింపులకు గురి చేస్తున్నారని, చేపల వలలను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించి తమకు సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.