పాట్నా: ఒకే రోజు నీట మునిగి 22 మంది మరణించారు. (Drowning Deaths) బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకే రోజు ఈ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. శనివారం బీహార్లోని పలు జిల్లాల్లో నీటిలో మునిగి సుమారు 22 మంది చనిపోయారు. భోజ్పూర్లో ఐదుగురు, జహనాబాద్లో నలుగురు, పాట్నా, రోహతాస్లో ముగ్గురు చొప్పున, దర్భంగా, నవాడలో ఇద్దరు చొప్పున, మాధేపురా, కైమూర్, ఔరంగాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నీట మునిగి మరణించారు.
కాగా, బీహార్లోని పలు చోట్ల ఒకే రోజు నీట మునిగి 22 మంది చనిపోవడంపట్ల సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది.