గువాహటి, నవంబర్ 26: దేశంలో గత ఐదేండ్లలో పాల ఉత్పత్తి 22.81 శాతం పెరిగిందని, మొత్తం ఉత్పత్తిలో 15.72 శాతంతో ఉత్తరప్రదేశ్ మిగిలిన రాష్ర్టాల కన్నా ముందంజలో ఉందని కేంద్ర మత్స్య, పశు, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల వెల్లడించారు. జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని గువాహటిలో ఆయన 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమ శాఖకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. 2022-23 సంవత్సరానికి దేశంలో పాల ఉత్పత్తిని 230.58 మిలియన్ టన్నులు అంచనా వేశామన్నారు. అయితే 2018-19 నుంచి చూస్తే గత ఐదేండ్లలో 22.81 శాతం వృద్ధిని సాధించిందన్నారు. గుడ్ల ఉత్పత్తిలో గత ఐదేండ్లలో 33.1 శాతం, మాంసం ఉత్పత్తిలో 20.39 శాతం, ఉన్ని ఉత్పత్తిలో 16.84 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు మంత్రి తెలిపారు.