సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 412 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇందులో 214 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది.
హిమాచల్ అసెంబ్లీ బరిలో దిగిన కోటీశ్వరుల జాబితాను పరిశీలిస్తే.. బీజేపీ నుంచి 56 మంది, కాంగ్రెస్ నుంచి 61, ఆప్ తరపున 35, బీఎస్పీ నుంచి 13, సీపీఎం నుంచి 4, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న వారిలో 45 మంది కోటీశ్వరులు ఉన్నట్లు నివేదికలో తెలిపారు. అయితే చోపాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బల్వీర్ సింగ్ వర్మ రూ. 128 కోట్లతో ప్రథమ స్థానంలో ఉన్నారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్(కాంగ్రెస్ అభ్యర్థి) రూ. 101 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. ఇక 412 మందిలో 66 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రిమినల్ కేసులు నమోదైన వారిని పరిశీలిస్తే.. తియోగ్ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా బరిలో దిగిన రాకేశ్ సింఘాపై అత్యధికంగా 30 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది.
హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 55 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం 7884 కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.