జైపూర్: బీజేపీ పాలిత మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లోనూ చోటుచేసుకున్నది. 21 ఏండ్ల గిరిజన మహిళను ఆమె భర్త మరికొందరు కలిసి నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. ఈ ఘటన ప్రతాప్గఢ్ జిల్లాలో గురువారం చోటుచేసుకొనగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త కొంత మందితో కలిసి తనను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి, వివస్త్రను చేసి నగ్నంగా గ్రామంలో ఊరేగించినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడితో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. బాధిత మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. బాధితురాలి భర్త, అత్తమామలు కలిసి ఆమెను కిడ్నాప్ చేసి నగ్నంగా ఊరేగించారని పేర్కొన్నారు. మహిళను నగ్నంగా ఊరేగించడంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలని రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్ పోలీసులను ఆదేశించింది.