Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని తనువు చాలించింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన నిషా యాదవ్ (21) అనే విద్యార్థిని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరియా (Auraiya) జిల్లాకు చెందిన నిషా కోటాలోని మహవీర్ నగర్ ప్రాంతంలో ఓ హాస్టల్లో ఉంటూ మెడికల్ పరీక్ష నీట్ కోసం ప్రిపేరవుతోంది. ఈ క్రమంలో గత నెల 29వ తేదీన రాత్రి నిషా తండ్రి ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చెయ్యలేదు. గురువారం మరోసారి కాల్ చేసినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. ఆందోళన చెందిన నిషా తండ్రి హాస్టల్ యాజమాన్యానికి ఫోన్ చేయగా.. వారు నిషా రూమ్కు వెళ్లారు. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తెరవకపోవడంతో డోర్స్ పగలగొట్టి లోపలికెళ్లి చూశారు. అక్కడ నిషా ఫ్యాన్కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది.
సమాచారం అందుకున్న కోటా పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, కోటాలో జిల్లా యంత్రాంగం తప్పనిసరి చేసిన యాంటీ హ్యాంగింగ్ పరికరాన్ని నిషా గదిలో అమర్చలేదని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సోమవారం కూడా ఓ నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్కు చెందిన 20 ఏళ్ల ఫౌరీద్ హుస్సేన్ తన రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ 29 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. రాజస్థాన్ పోలీస్ డేటా ప్రకారం.. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.
మరోవైపు విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో అప్రమత్తమైన రాజస్థానం ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగానే ఇటీవలే కోటాలోని అన్ని హాస్టళ్లు (Hostels), పెయింగ్ గెస్ట్ (PG) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల (Spring Loaded Fans)ను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఆగకపోవడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
Also Read..
India Vs Australia | భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్కి కరెంటు కష్టాలు.. స్టేడియంలో పవర్ కట్
Vladimir Putin | ఒక్కొక్కరు 8 మంది పిల్లల్ని కనండి.. అమ్మాయిలకు రష్యా అధ్యక్షుడి విజ్ఞప్తి
Bank Holidays | డిసెంబర్ నెలలో 18 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా మీకోసం..!