న్యూఢిల్లీ, మార్చి 5: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి కూడా నిందితుడు భారతీయుడే కావడం గమనార్హం. మద్యం మత్తులో ఆర్య వోహ్రా(21) అనే భారతీయ విద్యార్థి సహ ప్రయాణికుడిపై మూత్రం పోసిన ఘటన శనివారం న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్కు ఈ విషయమై అమెరికన్ ఎయిర్లైన్స్ నివేదిక సమర్పించింది. కేసు వివరాలను ఢిల్లీ విమానాశ్రయ ఏసీపీ ఆదివారం మీడియాకు వెల్లడించారు.
నిందితుడు అమెరికాలో చదువుకుంటున్నాడని, అతడిని దర్యాప్తు చేసిన తర్వాత ఇంటికి పంపించామని తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నప్పుడు, నిద్రపోతూ ఈ పని చేశాడని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై బాధితుడు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారు ఈ విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు తెలిపారు. తన కెరీర్ ప్రమాదంలో పడుతుందని నిందితుడు బాధితుడికి తెలిపి, జరిగిన ఘటన పట్ల క్షమాపణ కోరాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఆసక్తి చూపలేదని సమాచారం. గత నవంబర్లో శంకర్ మిశ్రా అనే భారతీయుడు సహ ప్రయాణికురాలిపై మూత్రం పోసిన సంగతి తెలిసిందే.