Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ : కాంగ్రెస్ అంటేనే కుర్చీల ఆట అనే విషయం అందరికీ తెలిసిందే. కీలక పదవుల్లో ఉన్నవారే పార్టీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా మారడం, ముఖ్యమంత్రులను మార్చడం ఆ పార్టీలో నిత్యం కనిపించే సన్నివేశాలు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం పలువురు పోటీ పడుతుండటంతో సిద్ధరామయ్య ఎంత కాలం ఆ పదవిలో ఉంటారోననే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్లో కూడా ఆ పరిస్థితి నెలకొంది. టోంక్ నియోజకవర్గంలో తన విజయం కోసం ప్రచారం చేస్తున్న సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ సీఎం అశోక్ గెహ్లాట్పై విరుచుకుపడ్డారు. 2020లో తాను కాంగ్రెస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశానని ఆరోపిస్తున్నారని, అసలైన తిరుగుబాటు గత ఏడాది సెప్టెంబరులో జరిగిందన్నారు. రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కోసం ఆ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన శాసన సభ్యుల సమావేశానికి అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని పైలట్ గుర్తు చేశారు. పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కోల్పోయారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో టికెట్ల కేటాయింపు చిచ్చు రగిల్చింది. చాలామంది సీనియర్ నేతలకు టికెట్లు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రామ్ గోపాల్ బైర్వా, మాజీ ఎమ్మెల్యే అశోక తన్వర్ సహా పలువురు నాయకులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరు పార్టీ వీడటంతో రెండు, మూడు సీట్లలో కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో జోథ్పుర్ జిల్లా సర్దార్పుర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న క్రిమినల్ కేసులను దాచిపెట్టారని, ఆయన నామినేషన్ను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి రెండు ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించి సీఎం గెహ్లాట్పై ఒక కేసు నమోదైందని, దోపిడీ, రేప్, లైంగిక నేరానికి సంబంధించి మరో కేసు నమోదైందని, వీటి గురించి ఆయనకు పూర్తిగా తెలిసినప్పటికీ, వాటిని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని.. ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరారు. దీనిపై పూర్తి నివేదిక అందించాలని ఎన్నికల ప్రధానాధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. తనపై కేసుల వివరాలను గెహ్లాట్ అఫిడవిట్లో వెల్లడించలేదని పేర్కొంటూ జైపూర్కు చెందిన పవన్ పారిక్ అనే మరో వ్యక్తి కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. చంపాదేవీ చారిటీ ట్రస్టుకు భూ కేటాయింపుల కుంభకోణం ఆరోపణలపై నమోదైన కేసు వివరాలను అఫిడవిట్లో పేర్కొనలేదన్నారు. సికర్ జిల్లాలోని రింగస్ పోలీసుస్టేషన్లో 2017, జులై 22న నమోదైన రేప్ కేసు, దోపిడీ కేసు కూడా నమోదైందని పారిక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.