Rs.2000 Notes | న్యూఢిల్లీ/ముంబై, మే 22: బ్యాంకుల ముందు పెద్ద లైన్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూ.. తొక్కిసలాటలు, ఎండలకు తాళలేక ప్రాణాలు విడిచిన వృద్ధులు.. ఇవీ 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల వద్ద కనిపించిన భయానక దృశ్యాలు. కేంద్ర ప్రభుత్వ తాజా అనాలోచిత రూ.2 వేల నోటు ఉపసంహరణ నిర్ణయం నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా ప్రజలు ముందు జాగ్రత్త పడుతున్నారు. మంగళవారం నుంచి బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొనగా… బ్యాంకులకు వెళ్లేందుకు ఇష్టపడని చాలామంది ఏదో విధంగా ఆ నోట్లను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా బ్యాంకుల క్యూలైన్ల బాధను తప్పించుకోవాలని చూస్తున్నారు.
అయితే చిన్న వర్తకులు, వ్యాపారులు 2 వేల నోట్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. బ్యాంకుల ముందు నిలబడాల్సి వస్తుందని వారు కూడా జంకుతున్నారు. దీంతో అనేకమంది మధ్య తరగతి ప్రజలకు ఎంతో నమ్మకమైన బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ప్రజలు ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. గతవారంతో పోలిస్తే దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. కొంతమంది ఆన్లైన్ కొనుగోళ్లు చేసి రూ.2 వేల నోటును ఇస్తున్నారు. అదే విధంగా పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి.
మాకొద్దు బాబోయ్…
దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు, వర్తకులు 2 వేల నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దొంగ నోట్లు కూడా వచ్చి పడతాయని జంకుతున్నారు. ప్రజలు ఎక్కువగా నగల దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఫుడ్ డెలివరీ యాప్ల వైపు మొగ్గుచూపుతున్నారు. కిరాణా, మెడికల్, కూరగాయల మార్కెట్, చిన్న వర్తకులకు రూ.2 వేల నోట్లను ఇవ్వగా… దుకాణదారులు వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. నగలు కొనుగోలు చేసి ఈ వ్యవహారం సద్దుమణిగాక వాటిని అమ్మి, తిరిగి సొమ్ము చేసుకుంటామని చాలామంది చెప్తున్నారు.
పెట్రోల్ బంకులకు బారులు…
ఒకటి, రెండు నోట్లు ఉన్నవారు పెట్రోల్ బంకులకు వెళ్తున్నారు. ప్రతిఒక్కరూ రూ.2 వేలు నోటు ఇస్తుండడంతో బంకుల వద్ద ‘నో ఛేంజ్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రానున్న నాలుగు నెలల పాటు 2 వేల నోట్లు ఇచ్చే తాను పెట్రోల్ పోయించుకుంటానని ఢిల్లీకి చెందిన అఖిల్ గుప్తా వెల్లడించారు. దుకాణదారులు ఈ నోట్లను తీసుకోవడం లేదని అందుకే బంకుకు వచ్చానని అజీమ్ అనే వ్యక్తి తెలిపారు. 2 వేల నోట్లతో చిల్లరకు ఇబ్బందిగా మారిందని మయూర్ విహార్లోని పెట్రోల్ బంకు సేల్స్ మేనేజర్ శైలేంద్ర మిశ్రా పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఓ బంకులో రూ.వెయ్యికు పైగా కొనుగోలు చేస్తేనే 2 వేల నోట్లను తీసుకుంటామని నోటీసు అంటించారు. లక్నో, ఇండోర్, కోల్కతా తదితర నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
జొమాటోకు 72 శాతం 2 వేల నోట్లే…
ఆర్బీఐ నిర్ణయం తర్వాత తమ కస్టమర్లు 2 వేల నోట్లను ఎక్కువగా ఇస్తున్నట్టు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ట్వీట్ చేసింది. శుక్రవారం నుంచి క్యాష్ ఆన్ డెలివరీలకు 72 శాతం 2 వేల నోటు రూపంలో చెల్లించినట్టు ఆ సంస్థ తెలిపింది. ‘కిడ్స్ బ్యాంకులకు వెళ్లి నోట్లు మార్చుకుంటారు. అడల్ట్ ఫుడ్ ఆర్డర్ చేసి 2 వేల నోటు రూపంలో నగదు చెల్లిస్తారు. లెజెండ్స్ 2 వేల నోట్లే తమ వద్ద ఉంచుకోరు’ అంటూ ఆ సంస్థ మరో ట్వీట్ చేసింది.
ఐడీ కార్డు లేకుండా నోట్ల మార్పిడొద్దని పిల్
గుర్తింపుకార్డు లేకుండా రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్, ఎక్స్చేంజ్ చేసుకోవద్దని కోరుతూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. నోట్ల మార్పిడికి ఎటువంటి గుర్తింపుకార్డులు అవసరం లేదని ఆర్బీఐ, ఎస్బీఐ పేర్కొన్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఎవరైతే నోటును మార్చుకుంటారో వారి అకౌంట్లోనే వాటిని జమ చేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. తద్వారా బ్లాక్ మనీ ఉన్నవారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
జవేరి బజార్లో కొనుగోళ్ల సందడి..
ముంబై, హైదరాబాద్, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లోని బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. ముంబై జవేరి బజార్లో బంగారం కొనుగోలుదారులు రూ.2 వేల నోట్లు చెల్లిస్తున్నారు. గత వారంతో పోలిస్తే 10 గ్రాములకు రూ.485 మేర బంగారం ధర పెరిగింది. అయినప్పటికీ రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం కొనుగోళ్లపై పడలేదు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో పోలిస్తే కొంతమేరకు రద్దీ తక్కువే ఉన్నట్టు ఇండియన్ బులియన్, జువెల్లరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. గతవారంతో పోలిస్తే కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయని ఓ దుకాణదారుడు తెలిపారు. కోల్కతాలో నగల కొనుగోళ్లు 15-20 శాతం పెరిగాయి. 2016 నాటి పరిస్థితులు లేవని, బంగారం దుకాణాల్లో 2 వేల నోట్లు తీసుకుంటున్నారని ఇండియా బులియన్, జువెల్లర్స్ అసోసియేషన్ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు అశోక్ బెగాని తెలిపారు.