Jhiram Valley : 2013లో చత్తీస్గఢ్లోని ఝీరాం వ్యాలీలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడి కేసులో ఎన్ఐఏ కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది. వీరికి సెప్టెంబర్ 16న శిక్షను ఖరారు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఈ ఘటన చత్తీస్గఢ్, బస్తర్ జిల్లా, దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝీరాం వ్యాలీలో, జాతీయ రహదారిపై మే 25, 2013న జరిగింది.
ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. మే 25న ఇక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ‘పరివాహన్ ర్యాలీ’ నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీ నిర్వహిస్తుండగా మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ర్యాలీలోని వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఉన్నారు. అప్పటి చత్తీస్గడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నంద కుమార్ పటేల్, అతడి కొడుకు, అసెంబ్లీలో ప్రతిపక్ష మాజీ నేత మహేంద్ర కర్మ, కేంద్ర మాజీ మంత్రి విద్యా చరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ వంటి నేతలు ప్రాణాలు కోల్పోయారు.
మిగతా మృతుల్లో సాధారణ పౌరులతోపాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించింది. 2013లో జరిగిన ఈ ఘటనపై నమోదైన కేసుపై విచారణ తాజాగా పూర్తైంది. 13 ఏళ్లపాటు, దాదాపు 101 మంది సాక్షులను విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు.. 10 మందిని దోషులుగా గుర్తించింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కేసు విచారణ పూర్తై.. నిందితులను దోషులుగా తేల్చినందును సెప్టెంబర్ 16న కేసులో కోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే, ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేస్తామని నిందితుల తరఫు లాయర్లు పేర్కొన్నారు.