దంగ్ (గుజరాత్), జూన్ 27: అది గుజరాత్.. ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా 13 ఏండ్లు పనిచేసిన రాష్ట్రం.. దేశానికే గుజరాత్ మోడల్ ఆదర్శమంటూ ప్రముఖులు గొప్పగా చెప్పుకున్న రాష్ట్రం.. కానీ ఆ రాష్ట్రంలో ఉన్న పాలన వ్యవస్థ, ప్రభుత్వ పనితీరుకు విసుగుచెందిన ఓ రైతు తన గ్రామ ప్రజల నీటి కష్టాలు తీర్చడానికి రెండేండ్లు కష్టపడి విజయం సాధించాడు. 20 ఏండ్లలో ప్రభుత్వం చేయలేని పనిని ఒకే ఒక్కడు రెండేండ్లు కష్టపడి చేసి చూపించాడు. అతడే దంగ్ జిల్లాకు చెందిన 60 ఏండ్ల గంగాభాయ్ పవార్. సాధారణంగా దంగ్ జిల్లాలో బాగానే వర్షాలు కురుస్తాయి. అయితే స్వభావరీత్యా ఆ నేలలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో ప్రతియేటా నీటి సమస్య ఎదురవుతున్నది. దీంతో తాగు, సాగునీటికి కష్టాలు పడాల్సి వస్తున్నది. ఈ సమస్య నుంచి తమ గ్రామ ప్రజలను కాపాడటానికి గంగాభాయ్ 20 ఏండ్లు పోరాటం చేశాడు. అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడు. సమస్య పరిష్కారం కాలేదు. లాభం లేదనుకున్న గంగాభాయ్ తానే రంగంలోకి దిగాడు. తట్ట, పార చేతపట్టాడు. బావిని తవ్వడం మొదలుపెట్టాడు. రెండేండ్లపాటు కష్టపడి 32 అడుగుల బావిని తవ్వాడు. నీళ్లు ఎగిసిపడ్డాయి. గ్రామ ప్రజలు గంగాభాయ్ను ప్రశంసలతో ముంచెత్తారు. 20 ఏండ్లలో జరుగనిది గంగాభాయ్ రెండేండ్లలో సాధించాడని మెచ్చుకున్నారు. ఈ 20 ఏండ్లలో బీజేపీ ఏం సాధించిందని, గుజరాత్ మోడల్ అంటే ఇదేనా అని నిలదీశారు.