షిమ్లా: ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఆ రాష్ట్రం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పలుచోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల వరదలు పోటెత్తి రహదారులు కొట్టుకుపోయాయి. ఇంకొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా నీట మునిగాయి.
దాంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5వ నంబర్ జాతీయ రహదారి సహా 20 రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండి జిల్లాలోని కటౌలాలో అత్యధికంగా 163.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వరుసగా సిన్హుటాలో 160 మిల్లీమీటర్లు, కసౌలీలో 145 మిల్లీమీటర్లు, కంగ్రాలో 143.5 మిల్లీమీటర్లు, హిమాచల్ రాజధాని షిమ్లాలో 99.2 మిల్లీమీటర్ల వర్షం పడింది.
మరో రెండు రోజులు కూడా హిమాచల్లో భారీ వర్షాలు పడుతాయని షిమ్లాలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఇదిలావుంటే వరదలు పోటెత్తడంతో పలుచోట్ల వాహనాలు దెబ్బతిన్నాయి. రాళ్లు, మట్టి కొట్టుకొచ్చి వాహనాలను కప్పేశాయి.