అహ్మాదాబాద్: కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి వెళ్లిన ఓ విమానాన్ని ఫ్రాన్స్లో 4 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. నికరాగ్వేకు వెళ్తున్న ఆ విమానంలో అక్రమంగా భారతీయుల్ని తరలిస్తున్నట్లు(Human Trafficking) ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ విమానాన్ని ఈనెల 26వ తేదీన తిరిగి ముంబైకి రప్పించారు. అయితే ఆ విమానంలో ప్రయాణించిన 276 మంది ప్రయాణికుల్లో గుజరాత్కు చెందిన 60 మంది ప్రయాణికులు ఉన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనుమానాల నేపథ్యంలో ఆ ప్రయాణికులను గుజరాత్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
సీఐడీ అధికారులు ఇప్పటి వరకు 20 మందిని విచారించినట్లు తెలుస్తోంది. నికరాగ్వే చేరుకున్న తర్వాత ఆ ప్రయాణికులు అక్రమరీతిలో అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్లాన్ వేసినట్లు భావిస్తున్నారు. అక్రమ తరలింపునకు పాల్పడిన ఏజెంట్ల ఎవరన్న దానిపై విచారణ చేపడుతున్నామని సీఐడీ ఏడీజీ ఎస్పీ రాజ్కుమార్ తెలిపారు. 60 మందిలో 20 మందిని విచారించామని, మిగిలిన వారిని కూడా త్వరలో ప్రశ్నించినట్లు ఆ అధికారి చెప్పారు.