కోల్కతా: గంగా నది ఘాట్ వద్దకు ఇద్దరు మహిళలు చేరుకున్నారు. వారి వద్ద ఉన్న సూట్కేస్ను నదిలో పడేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న వారు ఇది చూసి మహిళలను నిలదీశారు. ఆ సూట్కేస్లో మహిళ మృతదేహం ఉన్నట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. (Body In Suitcase) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 25న తెల్లవారుజామున కోల్కతాలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్ వద్దకు ఇద్దరు మహిళలు క్యాబ్లో చేరుకున్నారు. వెంట తెచ్చిన ట్రాలీ బ్యాగ్ను నది వద్దకు భారంగా ఈడ్చుకువచ్చారు.
కాగా, ఆ సమయంలో ఘాట్ వద్ద యోగా చేస్తున్న కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. ఆ మహిళలపై అనుమానం వ్యక్తం చేశారు. ట్రాలీ సూట్కేస్లో ఏం ఉందని ప్రశ్నించారు. చనిపోయిన తమ పెంపుడు కుక్క మృతదేహం ఉందని ఆ మహిళలు చెప్పారు. అక్కడ గుమిగూడిన జనం వారు చెప్పింది నమ్మలేదు. ఆ సూట్కేస్ను తెరువాలని అడగ్గా మహిళలు నిరాకరించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ట్రాలీ సూట్కేస్ను తెరిచి చూశారు. రక్తంతో తడిసిన దుస్తుల్లో చుట్టిన మహిళ మృతదేహం కుక్కి ఉండటం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యగ్రామ్ నివాసితులైన ఫల్గుణి ఘోష్, ఆమె తల్లి ఆరతి ఘోష్గా వారిని గుర్తించారు.
కాగా, సూట్కేస్లోని మృతురాలు మహిళల బంధువైన సుమితా ఘోష్గా పోలీసులు తెలుసుకున్నారు. ఆమె ఆత్యహత్యకు పాల్పడిందని, భయంతో మృతదేహాన్ని నదిలో పడేసేందుకు ప్రయత్నించినట్లు ఆ మహిళలు చెప్పారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతిపై వారిని ప్రశ్నిస్తున్నారు.