ఓ ఇద్దరు యువకులు.. ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులయ్యారు. క్షణం ఆలోచించకుండా ఉగ్రవాదుల్లో కలిసిపోయారు. కానీ ఆ ఇద్దరు ఉగ్రవాదుల తల్లులు మాత్రం తల్లడిల్లిపోయారు. ఏ తూటాలకు తమ బిడ్డలు బలైపోతారో అని బోరుమన్నారు. బిడ్డలను ఉగ్రవాద కార్యకలాపాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఆ ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టారన్న విషయం ఆ తల్లులకు తెలిసింది. క్షణాల్లోనే అక్కడ వాలిపోయారు. మేం మీ తల్లులం.. బయటకు వచ్చి లొంగిపోండి.. క్షమించమని భద్రతా బలగాలను కోరుతామని వేడుకున్నారు. మొత్తానికి తల్లుల గుండె ఘోషకు ఆ బిడ్డలు చలించిపోయారు. ఉగ్రవాద సంస్థను వీడి బలగాల ఎదుట లొంగిపోయారు.
జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని హదీగాం గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసుల సహాయంతో భద్రతా బలగాలు అక్కడ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో బలగాల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే ఆ ఇద్దరు టెర్రరిస్టులు నదీం అబ్బాస్, కఫీల్ మీర్ స్థానికులే అని పోలీసులు నిర్ధారించారు. దీంతో వారి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఇక తల్లిదండ్రులు, బలగాలు కలిసి వారిని లొంగిపోవాలని పదేపదే కోరారు. ఆయుధాలు పక్కన పెట్టి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.
బయటకు రా నదీం.. నేను మీ అమ్మను. నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే, భద్రతా బలగాలను క్షమించమని కోరుతాను. బయటకు వచ్చేయ్.. నీ కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఇలా అనేకసార్లు ఆమె కోరడంతో.. ఆ ఇద్దరు బయటకు వచ్చి బలగాల ఎదుట లొంగిపోయారు. ఆయుధాలను, మందు గుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు. ఈ ఇద్దరు ఇటీవలే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.