Terrorists arrest | పంజాబ్లోని అమృత్సర్లో స్థానిక పోలీసులు ఇద్దరు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఫిరోజ్పూర్ నివాసితులుగా గుర్తించారు. వారి కారులో సోదాలు చేపట్టిన పోలీసులకు మూడు హ్యాండ్ గ్రనేడ్లతో పాటు రూ.లక్ష నగదు లభించింది. అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితులిద్దరినీ పట్టుకున్నారు.
ఫిరోజ్పూర్లోని బరాకే గ్రామానికి చెందిన ప్రకాష్ సింగ్. అలీ గ్రామానికి చెందిన ఇంగ్లిష్ సింగ్ డాబుర్జి సమీపంలోని గ్రీన్ ఫీల్డ్, గార్డెన్ ఎన్క్లేవ్లో వైట్ కలర్ బ్రెజ్జా కారులో తిరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వీరి వద్ద పేలుడు పదార్థాలు ఉన్నాయని, భారీ ఘటనకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నారని పోలీసులకు ఆకాశ రామన్న సమాచారమిచ్చాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రీన్ ఫీల్డ్, గార్డెన్ ఎన్క్లేవ్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సెర్చ్ సమయంలో నిందితుల నుంచి 3 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి లక్ష రూపాయలను కూడా స్వాధీనపర్చుకున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.