ముంబై: నిబంధనలకు విరుద్ధంగా లౌడ్ స్పీకర్లలో అజాన్ పఠించిన రెండు మసీదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. బాంద్రా, శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లలో ఈ మేరకు రెండు కేసులు నమోదయ్యాయి. బాంద్రా పోలీసు కానిస్టేబుల్ హేమంత్ పగారే శనివారం బజార్ రోడ్లోని నూరానీ మసీదుపై అమర్చిన లౌడ్ స్పీకర్లలో అజాన్ ప్రసారం చేయడాన్ని గమనించారు. ఈ విషయాన్ని మసీదు ట్రస్టీ జాకెల్ టఫెల్ ఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే శబ్ధ కాలుష్యానికి సంబంధించిన నిబంధనలపై అజాన్ను పఠించే అన్వర్ అష్రఫ్ మహమ్మద్ షబ్బీర్ షాకు తాను చెప్పానన్నారు. దీంతో బాంద్రా పోలీసులు షబ్బీర్ షాపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 (ప్రభుత్వ సేవకుల ఉత్తర్వును ఉల్లంఘించడం), మహారాష్ట్ర పోలీసు చట్టం 1951లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, పశ్చిమ శాంతాక్రజ్ లింకింగ్ రోడ్లోని ముస్లిం కబరస్తాన్ మసీదుకు అజాన్ పఠించడానికి లౌడ్ స్పీకర్లను వినియోగించే అనుమతి ఉంది. అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదనే హామీని ఆ మసీదు శుక్రవారం ఉల్లంఘించింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో మసీదు అధ్యక్షుడు మహమ్మద్ షోయబ్ అబ్దుల్ సత్తార్ షేక్, మసీదు ఇమామ్ ఆరిఫ్ మహమ్మద్ సిద్ధిఖీపై శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అజాన్ కోసం వినియోగించే మైక్లను మసీదుల నుంచి తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో రెండు మసీదులపై ఈ మేరకు కేసులు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.