Cheetahs | న్యూఢిల్లీ, మే 25: దేశంలోకి 70 ఏండ్ల తర్వాత ప్రవేశించిన చీతాలకు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు (కేఎన్పీ) చితిలా మారింది. అక్కడి వాతావరణం భిన్నంగా ఉండటంతో చీతాలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ మొండిపట్టు.. అరుదైన చీతాలకు ప్రాణసంకటంగా మారింది. కేఎన్పీలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 46-47 డిగ్రీలు నమోదవుతుండటంతో చీతాలు అలమటించిపోతున్నాయి. ఇక కేఎన్పీలోనే రెండు నెలల క్రితం జన్మించిన చీతా కూనలు పిట్టల్లా రాలిపోతున్నాయి. చీతాలకు కునో అనువైన ప్రాంతం కాదని, వాటిని వెంటనే రాజస్థాన్కు తరలించాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సూచించినా, వన్యప్రాణి నిపుణులు నెత్తీనోరూ కొట్టుకొని మొత్తుకొంటున్నా.. కేంద్రం మాత్రం మొండిపట్టు విడువటం లేదు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లనే చీతాలను అక్కడికి తరలించేందుకు ప్రధాని విముఖత వ్యక్తంచేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆరు మృతి
గత ఏడాది సెప్టెంబర్లో దక్షిణాఫ్రికా నుంచి 12, నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానాల్లో తెచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు(కేఎన్పీ)లో వదిలారు. ప్రధాని మోదీ.. యథాప్రకారం ఫొటోలకు ఫోజులిచ్చారు. కేఎన్పీ అనువైన ప్రాంతం కాదని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు మొత్తుకున్నారు. మార్చి 27న సాశ, ఏప్రిల్ 23న ఉదయ్ మరణించాయి. మే 9న దక్ష అనే ఆడ చీతా గాయాలతో చనిపోయింది. కేఎన్పీలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరటంతో చీతాలు తట్టుకోలేకపోతున్నాయి. జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. తాజా వేసవి తాపానికి తాళలేక మూడు రోజుల క్రితం అందులో మూడు కూనలు మరణించాయి. నాలుగోదాని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
రూ.70 కోట్లు వృథా!అంతరించిపోయిన చీతాల్ని అడువుల్లో తిరుగాడేలా చేయటానికి గత యూపీఏ ప్రభుత్వ హయాం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి చీతాలను తెప్పించేందుకు ఆయా దేశాలతో ఒప్పందాలు జరిగాయి. ఎన్డీయే హయాంలో 20 చీతాలను తెచ్చి కునోలో వదిలారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.70 కోట్లు ఖర్చయ్యింది. రూ.50 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భరించింది. చీతాలను ఎక్కడ ఉంచాలన్న అంశంపై పర్యావరణవేత్తలు, వన్యప్రాణి నిపుణులు చేసిన పలు సూచనలు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోని కేఎన్పీలో వాటిని వదిలారు. ఇక్కడి అడవి విస్తీర్ణం చాలా తక్కువ. కేఎన్పీ చుట్టూ గ్రామాలున్నాయి. అడవిలో మానవ సంచారం కూడా ఎక్కువే. దీంతో చీతాల మనుగడకు ఈ అడవి అస్సలు పనికిరాదని నిపుణులు పేర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన వన్యప్రాణి నిపుణుడు విన్సెంట్ వాన్డిర్ మెర్వే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.