సుక్మా: ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు. సుక్మా (Sukma) జిల్లాలోని తండమెట్ల, దులేడ్ అటవీ ప్రాంతంలో జాగర్గుండా ఏరియా కమిటీకి చెందిన 10 నుంచి 12 మందితో కూడిన బృందం తిరుగుతున్నదని భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని జిల్లా పోలీసులు తెలిపారు.
మిగిలిన వారు పరారయ్యారని, వారికోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు. ఘటనా స్థలంలో 12 బోర్ డబుల్ బ్యారెల్ రైఫిల్, పిస్తోల్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మృతిచెందినవారిని మిలీషియా క్యాడర్కు చెందిన సోథి దేవ, రావ దేవగా గుర్తించామన్నారు. వారిద్దరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని తెలిపారు.