Howara-CSMT Express | రాంచీ : జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మిగతా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు.
జంషేడ్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబూ ప్రాంతంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు, పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో హౌరా – టిట్లాగఢ్ – కాంటాబాంజీ ఇస్పత్ ఎక్స్ప్రెస్, హౌరా – బార్బిల్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.
ఘటనాస్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదన్నారు. అలాగే అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను కూడా ఇంకా అంచనా వేయాల్సి ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Gold Rates | మరింత దిగిన బంగారం.. తులం వెయ్యి రూపాయలదాకా తగ్గుదల
Husband Birthday | భర్తంటే ఎంత ప్రేమో.. చెట్టుకు భర్త డ్రెస్ తొడిగి జయంతి వేడుక