Cheetah | భోపాల్, ఏప్రిల్ 24: చీతాలను ఉంచడానికి కునో జాతీయ పార్కుకు ప్రత్యామ్నాయంగా మరో ప్రదేశాన్ని ఎంపిక చేయాలని మధ్యప్రదేశ్ అటవీశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పార్కులో నెలరోజుల వ్యవధిలోనే రెండు చీతాలు మృతి చెందడాన్ని ప్రస్తావిస్తూ ఈ పార్కు పులుల ఆవాసానికి, గణనకు, సంరక్షణకు అనువుగా లేదని మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ తెలిపారు. ఈ ప్రదేశాన్నే గాంధీనగర్ అభయారణ్యం, నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యంగా అభివృద్ధి చేద్దామంటే రెండు, మూడేళ్లు పడుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నత అటవీ శాఖాధికారి తెలిపారు. గత సెప్టెంబర్ నుంచి నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడకు తెచ్చిన 8, 12 చీతాల నివాసానికి కునో జాతీయ పార్కు ఆమోదయోగ్యంగా లేదని అన్నారు. చీతాలను 24 గంటల పాటూ పరిశీలించడానికి తమకు 9 మంది కావాలని, కాని సరిపడా సిబ్బంది లేరని చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి ఫిబ్రవరిలో తెచ్చిన ఉదయ్ అనే చీతా ఆదివారం మృతి చెందిందని, ఈ నెలలో ఇది రెండో చీతా మరణమని ఆయన చెప్పారు. 747 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న కునో నేషనల్ పార్కులో తటస్థ ప్రాంతం 487 చదరపు కిలోమీటర్లు ఉందన్నారు.
చీతాలను ఇక్కడకు దిగుమతి చేయడానికి ముందే ఈ స్థలం, ఈ చీతాల ప్రాజెక్టుపై పలువురు నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ పార్కు పరిధి వాటి సంచారానికి చాలదని, చుట్టుపక్కల ప్రాంతాలలో గ్రామాలున్నందున వీటి సంచారానికి ఇబ్బంది కలుగుతుందని, అలాగే ఆయా గ్రామాలు ప్రజలకు ప్రాణాపాయం ఉంటుందని వారు పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. కాగా, చీతాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా 20 చీతాలను విదేశాల నుంచి కునో నేషనల్ పార్కుకు తెప్పించారు. అయితే వీటిలో ఇప్పటికే రెండు మృతి చెందగా, సియయా అనే చీతా మార్చిలో 4 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వాటి జీవావరణ వాతావరణ పరిస్థితులను పరిశీలించకుండా ఇక్కడకు తేవడం ప్రభుత్వ ముందుచూపు లేని చర్యకు నిదర్శనమని జంతు పరిశోధకులు అంటున్నారు. దక్షిణాఫ్రికాలో స్థిరమైన సామాజిక ప్రాదేశిక ప్రాంతాలలో తిరగడానికి అలవాటుపడ్డ చీతాలు ఇక్కడ సంచారానికి ఇబ్బంది పడతాయని అన్నారు. అక్కడ సగటున అవి తిరిగే ప్రదేశం పరిధి వంద చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుందని, అయితే కునో నేషనల్ పార్కులో వాటికి అంత పరిధిలో సంచరించే వీలుండదని నమీబియాకు చెందిన చీతా రిసెర్చ్ ప్రాజెక్ట్ సైంటిస్టు ఒకరు తెలిపారు.