ముంబై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే (IIT Bombay)కు చెందిన 1998 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ రీయూనియన్ వేడుక ఇటీవల జరిగింది. ఇందులో భాగంగా 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు రూ.57 కోట్ల నిధులు సమీకరించారు. తమకు మంచి జీవితాన్ని ఇచ్చిన అత్యున్నత విద్యా సంస్థకు ఆ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. రానున్న మూడేళ్ల నుంచి నాలుగేళ్లలో రూ.57 కోట్లు అందజేస్తామని చెప్పారు. హాస్టళ్లను అప్గ్రేడ్ చేయడానికి, కొత్త ఏఐ ల్యాబ్ ఏర్పాటు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం ఈ ఫండ్ను వినియోగించాలని కోరారు.
కాగా, 1998 బ్యాచ్ ఉదారత, దాతృత్వం పట్ల ఐఐటీ బాంబే డైరెక్టర్, ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, మరింత ఉన్నతంగా రాణించేందుకు ఈ నిధి సహాయపడుతుందని తెలిపారు. మిగతా పూర్వ విద్యార్థులందరికీ ఇది ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు.
విభిన్న నిష్ణాతుల సమిష్టి కృషితో ఐఐటీ బాంబేను ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల సరసన నిలిచేలా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఒకే బ్యాచ్ ద్వారా రూ.57 కోట్ల అత్యధిక నిధుల సమీకరణ జరుగడం విశేషం. గతంలో 1971 బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూ.41 కోట్లు సేకరించి విరాళంగా ఇచ్చారు.