న్యూఢిల్లీ, నవంబర్ 26: ఇమామ్లకు వేతనాలు ఇవ్వాలన్న 1993 సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని కేంద్ర సమాచార కమిషన్ తెలిపింది. వేతనాల చెల్లింపులు సామాజిక అసమ్మతికి దారితీస్తాయని వెల్లడించింది. ఇమామ్లకు ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ వక్ఫ్ బోర్డు చెల్లించే జీతాల వివరాలు ఇవ్వాలని సుభాష్ అగర్వాల్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకొంటే.. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తగిన సమాచారం ఇవ్వలేదు. దీంతో వక్ఫ్ బోర్డుకు కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) ఉదయ్ మాథుర్కర్ రూ.25 వేల జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడికి చెల్లించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఇమామ్ల వేతన చెల్లింపులపై మాట్లాడుతూ..పన్ను చెల్లింపుదారుల డబ్బు ఒక మతానికి వాడటం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంలోని అధికరణ 27ను ఉల్లంఘిస్తున్నట్టేనని స్పష్టం చేశారు. ఇమామ్లు, మౌజమ్లకు మాత్రమే వేతనాలు ఇవ్వటం వల్ల వివిధ మతాల ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడుతుందన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి సీఐసీ లేఖ రాశారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు రూ.30 లక్షల ఆదాయమే వస్తున్నదని, ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఈ బోర్డుకు ఏటా రూ. 62 కోట్ల గ్రాంట్ వస్తున్నదని వివరించారు. దీన్ని బట్టి పన్ను చెల్లింపుదారుల డబ్బు ఒక మతానికి వెళ్తున్నట్టేనని, ఆ మతానికి ప్రత్యేక లాభాలు కలిగించినట్టే అవుతుందని పేర్కొన్నారు.