ముంబై: ఒక యువకుడు పనిలో చేరిన మరునాడే ఇంటి యజమానురాలి గొంతు నొక్కి హత్య చేశాడు. ఆమెకు చెందిన డైమండ్, బంగారు గాజులు చోరీ చేశాడు. రైలులో పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. (domestic help strangles Woman employer) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బీహార్లోని దర్భంగాకు చెందిన 19 ఏళ్ల కన్హయ్య కుమార్ పండిట్ మార్చి 11న నేపీన్సీ రోడ్లో ఉన్న తహ్నీ హైట్స్లోని ఒక ఇంట్లో పనిమనిషిగా చేరాడు. యజమానురాలైన 67 ఏళ్ల జ్యోతి షా ధరించిన బంగారు ఆభరణాలపై కన్నువేశాడు. మార్చి 12న ఇంట్లో ఒంటరిగా ఉన్న యజమానురాలి గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం ఆమెకు చెందిన మూడు లక్షల విలువైన డైమండ్, బంగారు గాజులు చోరీ చేసి ఆ ఇంటి నుంచి పారిపోయాడు.
కాగా, జ్యుయలరీ షాపు యజమాని అయిన ముఖేష్ తన భార్య జ్యోతి షాకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చి చూశాడు. బెడ్పై అచేతనంగా భార్య పడి ఉండటం చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కొత్తగా చేరిన పని మనిషి కన్హయ్య కనిపించకపోవడం, జ్యోతి షాకు చెందిన బంగారు, వజ్రపు గాజులు మాయం కావడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్హయ్య కుమార్ కోసం పలు చోట్ల వెతికారు. అతడి కుటుంబ సభ్యులు, బంధువులను ఆరా తీశారు. బస్తాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులను అలెర్ట్ చేశారు. చివరకు లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బీహార్ వెళ్లే రైలులో నిందితుడు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. దొంగించిన నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.