Norovirus | కేరళ రాష్ట్రంలో నోరో వైరస్ కలకలం సృష్టించింది. ఎర్నాకులం జిల్లాలోని కక్కనాడ్లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకింది. పాఠశాలలో 1, 2వ తరగతి చదువుతున్న సుమారు 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. నోరో వైరస్ అనుమానంతో వారందరి నమూనాలను ల్యాబ్కు పంపగా.. అందులో 19 మందికి పాజిటివ్గా తేలింది. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు పాజిటివ్ తేలిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని.. భయపడాల్సిన అవసరం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. పాఠశాలలోని మిగిలిన విద్యార్థులంతా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
నోరో వైరస్ను స్టమక్ ఫ్లూ, స్టమక్ బగ్ అని కూడా పిలుస్తారు. దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. ఇది అన్ని వయస్సుల వారికి సోకుతుంది. కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాల కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఈ వైరస్ ప్రధాన లక్షణాలు. ఈ వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల తర్వాత దాని లక్షణాలు బయటపడతాయి. వైరస్ బారినపడిన వ్యక్తుల మలం, వాంతిలో దీని ఆనవాలు కనిపిస్తాయి. నోరో వైరస్ బారిన పడిన వ్యక్తులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది.