న్యూఢిల్లీ: 18వ లోక్సభ( Lok Sabha) ఎన్నికల్లో 280 మంది ఎంపీలు కొత్తగా కనిపించనున్నారు. 2024 ఎన్నికల్లో తొలిసారి 280 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019లో ఆ సంఖ్య 267గా ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. తాజా ఎన్నికల్లో ఎన్నికైన వారిలో 263 మంది గతంలోనూ ఎంపీలుగా చేశారు. పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసర్చ్ సంస్థ ఈ డేటాను ఇచ్చింది. మళ్లీ ఎన్నికైన ఎంపీల్లో.. 8 మంది తమ నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. ఒకరు మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. 17వ లోక్సభలో ఓ పార్టీ తరపున ఎన్నికైన 9 మంది ఎంపీలు.. ఈసారి మరో పార్టీ గుర్తుపై మళ్లీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. 53 మంత్రులు పోటీ చేయగా, దాంట్లో 35 మంది మాత్రమే ఎన్నికయ్యారు. 18వ లోక్సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ పార్టీ 240 సీట్లు గెలుచుకున్నది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ 37 సీట్లతో మూడవ స్థానంలో ఉన్నది.