చండీఘడ్ : పంజాబ్ రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మళ్లీ పోరుబాట పట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళనలో భాగంగా రైతులు రైల్ ట్రాక్లపైకి చేరి నిరసన తెలపడంతో ఫిరోజ్పూర్ డివిజన్లో 18 రైళ్లు నిలిచిపోయాయి. వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆర్ధిక సాయం ప్రకటించడంతో పాటు, గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించడం, రుణ మాఫీ వంటి పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కిసాన్ మజ్ధూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలో పలు రైతు సంఘాలు మూడు రోజుల పాటు రైల్ రోకోకు పిలుపు ఇచ్చాయి
. రైల్ రోకో తొలి రోజులో మొత్తం 18 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఫిరోజ్పూర్ డివిజన్కు చెందిన రైల్వే అధికారి వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
2021లో లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాపై చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ రైతులకు అన్యాయం చేయాలని ఎవరైనా తలపెడితే పంజాబ్ రైతులకు హరియాణ రైతులు కూడా బాసటగా నిలుస్తారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన శర్వన్ సింగ్ పంధేర్ వెల్లడించారు.
Read More