బెంగళూరు / జైపూర్ : రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, రాజస్థాన్లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆడి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో దాంట్లో ప్రయాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగతా నలుగురు కూర్చున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వయసున్న వారే.. కరుణా సాగర్, బిందు (28), అక్షయ్ గోయల్, ఇషిత (21), ధనూష (21), రోహిత్, ఉత్సవ్ ఉన్నారు. కరుణా సాగర్, బిందు భార్యాభర్తలు. వీరిద్దరూ హోసూరు ( తమిళనాడు ) డీఎంకే ఎమ్మెల్యే వై ప్రకాశ్ కొడుకు, కోడలు. సెయింట్ జాన్స్ హాస్పిటల్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదు..
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్కరూ కూడా సీటు బెల్ట్ ధరించలేదని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాజస్థాన్లోని నాగౌర్లో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 11 మంది మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బికనీర్ – జోధ్పుర్ జాతీయ రహదారిపై సంభవించింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాగౌర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.