నిరసనలకు దిగొచ్చిన కేంద్రం
శ్రీనగర్, జూన్ 4: జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన ఉపాధ్యాయులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. జమ్ముకశ్మీర్లో వరుస హత్యల నేపథ్యంలో అక్కడ నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్షా శుక్రవారం ఆర్మీ చీఫ్, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
గత నెల 12న బుద్గాం జిల్లాలో రాహుల్ భట్ అనే ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చిచంపడం, ఆ తరువాత జరిగిన వరుస హత్యలతో హిందువుల్లో భయాందోళనలు పెరిగాయి. తమను సురక్షిత ప్రాంతాలకు లేదా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది పండిట్, హిందూ ఉద్యోగులు ఆందోళనల బాట పట్టారు.